VM Today News - వార్తలు / పల్నాడు : నరసరావుపేట పట్టణంలోని కాకుమాను బజార్లో మహాశివరాత్రి సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలో పట్టణ టూ టౌన్ సి.ఐ. ప్రభాకర్ గారు ప్రదర్శించిన ధైర్యసాహసం ప్రశంసలు అందుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను చాకచక్యంగా రక్షించి వారి ప్రాణాలను కాపాడిన ఆయన సేవాభావాన్ని స్థానికులు కొనియాడారు. ఈ నేపథ్యంలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభాకర్ గారికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభాకర్ గారికి ఇలాంటి సాహసాలు కొత్తవి కాదని తెలిపారు. గతంలో షాపింగ్ మాల్ ఘటనలోనూ ఆయన సమయోచిత నిర్ణయాలతో ప్రజలను రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా టూ టౌన్ పోలీస్ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన పట్టుదల, ప్రకృతిపై ఉన్న అభిరుచి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంకాయలపాటి రవి (అడ్వకేట్), రిటైర్డ్ ఏ.ఎస్.ఐ. సలాం గారు మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని దేవుని ప్రార్థించారు.
Reporter
VMToday News